- సారంపల్లి మల్లారెడ్డి ప్రజా ఉద్యమాలకు జీవితాన్ని అంకితం చేశారు : బీవీ రాఘవులు
హసన్ పర్తి,వెలుగు : భూమి, రైతాంగ సమస్యలపై నిరంతరం పోరాటాలు చేయడమే కమ్యూనిస్టుల లక్ష్యం అని సీపీఎం పొలిట్బ్యూరో సభ్యుడు బీవీ.రాఘవులు అన్నారు. హనుమకొండ జిల్లా భీమారంలో గురువారం జరిగిన సారంపల్లి మల్లారెడ్డి సంతాపసభకు ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీరు, భూమి, విద్య, పేదల హక్కుల కోసం, సాగునీటి ప్రాజెక్టులు, కాలువల కోసం కమ్యూనిస్టులు ఉద్యమాలు చేశారని చెప్పారు. మల్లారెడ్డి.. చివరి వరకు పార్టీ కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేశారని చెప్పారు.
ప్రజల్లో ఉంటేనే ఆరోగ్యంగా ఉంటామని ఆయన తరచూ చెప్పేవారని గుర్తు చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడమే మల్లారెడ్డికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి. ప్రభాకర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎస్. వీరయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్రెడ్డి, రేవూరి ప్రకాశ్రెడ్డి, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్, మాజీ మేయర్ టి. రాజేశ్వరరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జి. నాగయ్య, పోతినేని సుదర్శన్ పాల్గొన్నారు.
